Thursday, December 6, 2012

'బాద్‌షా'లో ఎన్టీఆర్ క్యారక్టరైజేషన్ కేక


Badshah Shoot At Shamshabad
ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రాజధానిలో షూటింగ్ జరుగుతోంది. శంషాబాద్‌ విమానాశ్రయ ప్రాంగణంలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.ఈ సందర్బంగా కలిసిన మీడియాతో శ్రీను వైట్ల మాట్లాడారు.

చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ గురించి శ్రీనువైట్ల చెప్తూ...అతనొక్కడే. కానీ ఓ సైన్యం నడిచొస్తున్నట్టుంటుంది. చాలా తక్కువ మాట్లాడతాడు.. కానీ ప్రతి మాటా ఓ మిస్సైల్‌లా దూసుకొస్తుంది. ఒక్కసారే మాటిస్తాడు... ప్రాణం ఉన్నంత వరకూ దానికి కట్టుబడి ఉంటాడు. అందుకే... అతను 'బాద్‌షా' అయ్యాడు. ఇంతకీ అతని గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు శ్రీను వైట్ల.

''పేరుకి తగ్గట్టే.. శక్తిమంతమైన కథ ఇది. ఎన్టీఆర్‌ని ఇది వరకెప్పుడూ చూడని కోణంలో చూపిస్తున్నాం. పాత్ర తీరే కాదు.. ఆయన గెటప్‌ కూడా సరికొత్తగా ఉంటుంది''అని నిర్మాత తెలిపారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు.

థాయ్‌ భాషలో రాజమౌళి 'ఈగ'

Rajamouli Eega Be Released Thai Version
'ఈగ'త్వరలో ధాయ్ లాండ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఈగ' తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు విదేశాలకీ ఎగరబోతోంది. థాయ్‌ భాషలోకి 'ఈగ' చిత్రాన్ని అనువదించబోతున్నారని సమాచారం. థాయ్‌లాండ్‌ దేశవాసులూ సినీప్రియులే కావటంతో ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నారు.

భారత సంస్కృతికి దగ్గరగా ఉంటాయి వారి పద్ధతులు, అభిరుచులు. 'ఈగ'లోని సాంకేతిక మాయాజాలంతోపాటు ఆత్మ మరో ప్రాణిలోకి ప్రవేశించడం లాంటి అంశాలు థాయ్‌లాండ్‌ వాసులకు నచ్చుతాయనే ఉద్దేశంతో ఆ చిత్రాన్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. భారత చిత్రసీమ ఇన్నాళ్లూ ఆ దేశాన్ని షూటింగులకు అనువైన ప్రాంతంగా మాత్రమే భావించింది. ఇక థాయ్‌లాండ్‌ని ఓ మార్కెట్‌గా మలచుకోబోతున్నారు. ఆ దేశానికి చెందిన కొందరు ఎగ్జిబిటర్లు ఇప్పటికే పలువురు హిందీ నిర్మాతలతో ఒప్పందాలు చేసుకున్నారు... అనువాద హక్కుల కోసం. వచ్చే యేడాది నుంచి భారతీయ చిత్రాలు థాయ్‌లోకి అనువాదం కాబోతున్నాయన్న మాట.

నో ఫంక్షన్ : రిలీజైన ‘సారొచ్చారు’ ఆడియో

మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న ‘సారొచ్చారు' ఆడియో ఎలాంటి హడావుడి, ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజైంది. ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. రవితేజ ఇమేజ్ కు తగిన విధంగా ఈచిత్రంలో దేవిశ్రీ మాస్ బీట్లతో పాటు, వినసొంపైన మొలోడీలను కంపోజ్ చేసాడు.
sarocharu audio released directly into the market
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆడియో సాంగ్స్ ట్రాక్ లిస్ట్ వివరాలు
1. మేడ్ ఫర్ ఈచ్ అదర్
2. జగదేక వీరా
3. రచ్చ రంబోలా...
4. గుస గుస
5. కాటుక కళ్లు

Wednesday, December 5, 2012

రాజమౌళితో చేయాలని ఉంది :- అక్షయ్ కుమార్

Akshay Kumar Wants Rajamouli
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘కిలాడీ 786' షూటింగులో బిజీగా గడుపుతున్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన అక్షయ్ కుమార్ ఇక్కడ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నాడు. ఈచిత్రం భిన్నంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా సౌత్ సినిమా స్టాండర్డ్స్‌పై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు అక్షయ్ కుమార్ స్పందిస్తూ...‘సౌత్ సినిమాలపై నేను సీరియస్ గా దృష్టి పెడుతున్నాను. నా సినిమాల్లో చాలా వరకు సౌతిండియా దర్శకులు తీసిన సినిమాలకు రీమేకే. వారు చాలా ప్రతిభా వంతులు. సౌతిండియా సినీ పరిశ్రమలో పని చేసిన వారు బాలీవుడ్ ఇంటస్ట్రీలో పని చేయడానికి ఆసక్తి చూపితే నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. నాకు రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఉంది, కానీ అది కుదురుతుందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను' అంటూ అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ లో నటించబోతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్టయిన ‘తుపాకి' చిత్ర రీమేకులో చేయబోతున్నాడు. కథాపరంగా ఇది ముంబయిలో జరిగే అంశం కావడంతో హీరో అక్షయ్‌కుమార్‌ హిందీలో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విపుల్‌షా నిర్మాతగా తెరకెక్కనుంది. మురగదాస్ దర్సకత్వం వహిస్తారు.

Latest Info ప్రభాస్ ‘మిర్చి’

Prabhas Mirchi Shooting Wrapped Up Dec 11
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘మిర్చి' చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగుకు సంబంధించిన పని దాదాపుగా అయిపోయినట్లే. మరో వారం రోజుల్లో షూటింగ్ వర్క్ మొత్తం పూర్తి కానుందని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం. రేపటి నుంచి ఓ సాంగుతో పాటు మిగిలి ఉన్న కొన్ని సీన్లను షూట్ చేయనున్నారు.

యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
గతంలో ఈచిత్రాన్ని డిసెంబర్లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నిర్మాతలు, ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా థియేటర్ల సమస్య కారణంగా ‘మిర్చి' ఫిబ్రవరి 8న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Thursday, September 6, 2012

‘షిరిడి సాయి’ రివ్యూ..........





అన్నమయ్యతో ఊహించని విజయాన్నందుకున్న నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి.. అదే కోవలో శ్రీరామదాసును తెచ్చి, మరో విజయాన్నందుకున్నారు. ఈ కాంబినేషన్లో వచ్చిన మరో ఆధ్యాత్మిక చిత్రం ‘షిరిడి సాయి’. తొలి రెండు సినిమాలైతే మనకు కొంచెం కొత్తే. దీనికి తోడు దర్శకేంద్రుడు.. తనదైన గ్లామర్, ఎంటర్టైన్మెంట్ టచ్ ఇచ్చి.. ఆ సినిమాల్ని అందరూ మెచ్చేలా తీర్చిదిద్దారు. ఐతే తాజా చిత్రం మాత్రం ఆ రెండింటికీ భిన్నమైంది. అక్కడ భక్తుడు ప్రధాన పాత్రధారి అయతే ఇక్కడ దైవానిది ముఖ్య పాత్ర. కాబట్టి మసాలాలు అద్దే అవకాశం లేదు. అందులోనూ ఇది అందరికీ తెలిసిన కథ. ఇప్పటికే సాయి నేపథ్యంలో సినిమాలు కూడా వచ్చాయి. ఇన్ని పరిమితుల మధ్య తయారైన ‘షిరిడి సాయి’ ప్రేక్షకుల్ని మెప్పించిందా..? చూద్దాం!

కథ గురించి చెప్పాల్సిన కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందరికీ తెలిసిందే. సాయి పుట్టుక నుంచి మరణం వరకు ఆయన జీవితాన్ని చూపించారు. ఇలాంటి సినిమా తీయాలన్న ప్రయత్నం మెచ్చదగిందే. ఐతే పైన చెప్పుకున్న పరిమితుల మధ్య ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దితే తప్ప ప్రేక్షకులకు ఎక్కదు. ఈ విషయంలో చిత్ర బృందం కొంతమేరకు విజయవంతమైంది. సినిమా ప్రథమార్ధంలో బాబా మహిమల మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. ద్వితీయార్ధంలో సాయితత్వాన్ని చెప్పేందుకు ప్రయత్నించారు.  ఐతే అన్నమయ్య, శ్రీరామదాసు తరహాలో విభిన్నమైన సన్నివేశాలు చూపించడానికి ఇందులో ఎక్కువ అవకాశం లేకపోయింది. భక్తి విషయాన్ని పక్కనబెడితే.. సాయి తత్వాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో రాఘవేంద్రరావు సఫలమయ్యారు. టైటిల్స్ సమయంలో సాయి జన్మ వృత్తాంతాన్ని బొమ్మల రూపంలో చెప్పడం.. ఆ సందర్భంగా వచ్చే పాట ఆకట్టుకుంటాయి. గతలో వచ్చిన సాయి సినిమాలకు భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు చేశారు. శ్రీహరి పాత్ర ఆ ఉద్దేశంతో తెచ్చిందే. ఐతే ఆ పాత్ర పండలేదు. శ్రీహరి ఏమాత్రం ఆ పాత్రకు సూటవలేదు. ఆరంభంలో ఆంగ్లంలో డైలాగులు చెప్పే శ్రీహరి పాత్ర.. చివర్లో స్లాంగ్ కూడా మార్చకుండా అచ్చతెలుగులో మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. షాయాజి షిండే పాత్రను విలన్ లా ప్రొజెక్ట్ చేయాలని చూశారు కానీ.. అతనికి ఏదో ఒక దశలో జ్నానోదయం అవుతుందని ముందే అర్థమవతుంది. ఐతే కావాలనే అతని పాత్రను చివరిదాకా పొడిగించారు. షాయాజి పాత్ర ద్వారా కాస్త వినోదం పండిద్దామన్న ప్రయత్నం చేశారు కానీ.. అదేం ఫలితాన్నివ్వలేదు. ప్రథమార్ధం సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ కు ముందొచ్చే శ్రీరామనవమి-ఉరుసు సన్నివేశం బావుంది. క్లైమాక్స్ లో నాగ్ ను చూస్తే అన్నమయ్య గుర్తొస్తుంది. క్లైమాక్స్ గొప్పగా ఉంది. రాఘవేంద్రరావు తన ప్రత్యేకత అంతా ఇక్కడే చూపారు. ఐతే అంతకుముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తిని తగ్గిస్తాయి. బాలసాయిగా చేసిన కుర్రాడు ఆకట్టుకోలేదు. నటీనటుల మేకప్ విషయంలో శ్రద్ధ వహించలేదు. బాలసాయి పెద్దవాడై తిరిగి వచ్చే సమయానికి ముసలావిడ మేకప్ మార్చారు కానీ.. శరత్ బాబు మాత్రం అంతకు ముందులాగే ఉంటాడు. కమలిని కూడా తొలి సన్నివేశంలో ఓ మేకప్ తో ఉంటుంది.. తర్వాతి సన్నివేశంలో మరోలా ఉంటుంది. ఇవి చిన్న విషయాలే కావచ్చు. వీటిని పట్టించుకోకుంటే ప్రేక్షకుడు సినిమాలో లీనం కాలేడు.

రాఘవేంద్రరావు మునుపటి స్థాయిలో మాయ చేయలేకపోయారు కానీ ఉన్న పరిమితుల్లోనే ‘శిరిడి సాయి’ని బాగానే తీశారు. కొన్పి సన్నివేశాల్లో ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. పాటల చిత్రీకరణ.. అందులోనూ మొదటి పాట ‘ఒక్కడే దేవుడు’ పాట చిత్రీకరణ బాగుంది. ఖర్చుకు వెనుకాడకుండా మంచి ప్రయత్నం చేసిన నిర్మాత మహేష్ రెడ్డిని అభినందించాలి. సినిమాను నిలబెట్టడానికి కీరవాణి శాయశక్తులా ప్రయత్నించారు. ఆయన సంగీతమే సినిమాకు ప్రధాన ఆకర్షణ.  స్కోర్ తీసి చూస్తే.. సన్నివేశాలు చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కడే దేవుడు, నీ పాదముల.. పాటలు ఆకట్టుకుంటాయి.  ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ తీసి చూస్తే.. సన్నివేశాలు చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కడే దేవుడు, నీ పాదముల.. పాటలు బాగా ఆకట్టుకుంటాయి. పరుచూరి బ్రదర్స్ మాటలు సందర్భోచితంగా ఉన్నాయి. నువ్వు తినడం ప్రకృతి, పక్కవాడిది దోచుకు తినడం వికృతి, నువ్వు తింటూ పక్కవాడికి పెట్టడం సంస్కృతి.. అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇలాంటి డైలాగులు మరికొన్ని ఉన్నాయి.

అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రల్లో ఒదిగిపోయిన నాగార్జున సాయి పాత్రలోనూ ఆకట్టుకున్నారు.ఆరంభంలో సాయి పాత్రలో నాగ్ ను చూడగానే మామూలుగా అనిపిస్తారు. సినిమా సాగే కొద్దీ పరిణతి కనిపిస్తుంది. సన్నివేశాలు సాగే కొద్దీ సాయి దేవుడిలా మారుతున్న భావన కలిగిస్తాడు నాగ్. పతాక సన్నివేశంలో మళ్లీ అన్నమయ్య, శ్రీరామదాసులను గుర్తుకు తెచ్చారు. ఐతే కొన్నిచోట్ల ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు సూటవలేదు. పతాక సన్నివేశంలో, మరికొన్ని సన్నివేశాల్లో చక్కగా అభినయించిన నాగ్.. కొన్నిచోట్ల మాత్రం ఇబ్బందిగా కనిపించారు. పాత్ర హావభావాల విషయంలో యూనిఫార్మిటీ మెయింటైన్ చేయలేకపోయారు. బహుశా దర్శకుడి సూచన మేరకు అలా చేశారేమో. మూడు రోజుల పాటు తాను పైలోకానికి వెళ్లొస్తానని చెప్పే సన్నివేశంలో నాగ్ నటన అంతగా ఆకట్టుకోలేదు. అన్నీ తెలిసిన దేవుడు.. అంత ఉద్వేగానికి ఎందుకు గురవుతాడో అర్థం కాదు. పరిణతితో కనిపించాల్సిన సాయి పాత్ర అంత ఉద్వేగానికి లోనవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఐతే ఓవరాల్ గా నాగ్ సాయిబాబా పాత్రలో మెప్పించారు. దాసుగణంగా శ్రీకాంత్, నానావతిగా సాయికుమార్, సుందరీబాయిగా కమలిని, సెహన్ షాగా శరత్ బాబు ఆకట్టుకున్నారు.

మొత్తంగా చూస్తే శిరిడి సాయి నిరాశ పరచదు. ఈ కాలంలో ఇలాంటి సినిమాలు రావడం గొప్ప విషయం. రొటీన్ మాస్ సినిమాల మధ్య ‘శిరిడి సాయి’ ఉపశమనాన్నిచ్చేదే. ఐతే అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల రోజులు వేరు. లాంగ్ రన్ లో సినిమాలు నిలబడ్డాయి. కానీ ఇప్పుడంతా ఒకట్రెండు వారాల్లో తేలిపోయే వ్యవహారం. కాబట్టి పోటీని తట్టుకుని ‘షిరిడి సాయి’ నిలబడుతుందా లేదో చూడాలి........

Tuesday, September 4, 2012

వర్మ ‘భూత్ రిటర్న్స్’ ఫస్ట్‌లుక్.....

ఈ మద్య వరస గొడవలతో వివాదాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మకు ఎప్పుడు ఒకలాగే ఉండటం అసలు నచ్చదు. ప్రచారం కోసం అనవసరపు వివాదాలు సృష్టించి ఆ తరవాత అప్పలరాజు, దొంగల ముఠా వంటి సినిమాలు తీసి జనాలను ఫూల్స్ ను చేసిన వర్మ ఇప్పుడు కొద్దిగా మార్పు కోసం సినీ జనాలను భయపెట్టే ప్రయత్నాల్లో పడ్డాడు. గతంలో తాను రూపొందించిన ‘భూత్'కు సీక్వెల్‌గా ‘భూత్ రిటర్న్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

ram gopal varma bhoot returns first poster out


తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టరే ఇలా భయపెడుతుంటే సినిమా ఎలా ఉంటుందో? అక్టోబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 3డి ఫార్మాట్‌లో దీన్ని రూపొందించారు. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా...ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ఈ చిత్రాన్ని విడుదచేస్తున్నారు. రామ్ గోపాల్ కెరీర్లోనే ఇది ఫస్ట్ 3డి సినిమా.

నిన్నటి తరం కథానాయిక మనీషా కోయిరాలా ఇందులో తల్లి పాత్ర పోషించగా, ఆరేళ్ళ అలయ్న అనే పాప కీలక పాత్ర పోషించింది. ఈ కథ వీరిద్దరి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, వీరిద్దరే ఈ సినిమాలో ఎక్కువగా కనిపిస్తారు. జేడీ చక్రవర్తి మరో పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'భూత్ రిటర్న్స్ హర్రర్ మూవీ. బూత్ సినిమా మిమ్మల్ని భయపెడితే.., భూత్ రిటర్న్స్ మిమ్మల్ని చంపేస్తుంది' అని అంటున్నాడు వర్మ. వివాదాలతో చేసిన ప్రయోగాలూ కాసులు రాల్చవనే ఉద్దేశానికి వచ్చి తిరిగి తన పాత ఫార్ములానే నెత్తి కెత్తు కుంటున్న వర్మ ఈ సినిమాతో ఎంత వరకు సఫలీకృతం అవుతాడో వేచి చూడాలి.

శ్రీకాంత్ సినిమా ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్......

Pawan Kalyan Launch Devaraya Audio
శ్రీకాంత్, విదీష, మీనాక్షి దీక్షిత్ కాంబినేషన్లో నాని కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవరాయ'. నానిగాడి సినిమా సమర్పణలో సన్ రే ఇంటర్నేషనల్ పతాకంపై కిరణ్ జక్కం శెట్టి, నాని కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ ఈ నెల 12న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని పాటలను ఆవిష్కరించనున్నారు.

ఈ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ...‘పవన్ కళ్యాణ్ మా ఫంక్షన్‌కు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రీకాంత్ కెరీర్లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. శ్రీకృష్ణ దేవరాయలు, దొరబాబుగా ఆయన రెండు పాత్రల్లో కనిపిస్తారు. రాయలవారి గెటప్‌లో ఆయన చాలా హుందాగా ఉన్నారు. షూటింగ్‌తో పాటు రీ రికార్డింగ్ తదితర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం డీటీఎస్ వర్క్ కు సిద్ధం అవుతున్నాం. చక్రి సంగీతం ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నెల ద్వితీర్థంలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం' అన్నారు.
100 సినిమాల హీరో శ్రీకాంత్‌ శ్రీకృష్ణదేవరాయలుగానూ, విలేజ్‌లో దొరబాబుగానూ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘దేవరాయ'. ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ 'నాని నాకు మూడు కథలు చెప్పారు. అందులో ఈ కథ నచ్చి నాకూ ప్లస్‌ అవుతుందని అంగీకరించాను. చెప్పినట్లు బాగానే తీశాడు. ఇందులో దేవరాయగా, దొరబాబుగా రెండు పాత్రలు పోషించాను. ఒకరకంగా చెప్పాలంటే ఇష్టపడి, ఒల్లు దగ్గర పెట్టుకుని పనిచేశాను.

మహేష్ సినిమాలో దేవిశ్రీ ఎక్స్‌పర్మెంట్......

 


మహేష్ బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్‌తో తొలి సినిమా కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు.

ఇందులో ఓ సాంగుపై దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్‌పర్మెంట్ మొదలు పెట్టాడు. దీని గురించి తన మైక్రో బ్లాగింగ్ సైట్లో ప్రస్తావిస్తూ...‘మహేష్ బాబు, సుకుమార్ సినిమాకు సంథింగ్ స్పెషల్‌గా రాడికల్లీ డిఫరెంట్‌గా ట్యూన్స్ ట్రై చేస్తున్నాను. ఇది తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా ఉండబోతోంది. కొత్తదనాన్ని ఆడియన్స్ స్వాగతిస్తారని తన నమ్మకం' అంటూ పేర్కొన్నారు.

సుకుమార్ తన వరుస సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ప్రిపర్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య, ఆర్య2, జగడం, 100% లవ్ చిత్రాలకు దేవిశ్రీనే స్వరాలు సమకూర్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమాకు దేవిశ్రీ అందించే అందించే సంగీతంపై కూడా మంచి అంచనాలున్నాయి....


కమల్‌ 'విశ్వరూపం'లేటుకి కారణమేంటి?

 


కమల్‌హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఇప్పుడు రిలీజ్ కావటం లేదు. దానికి కారణం డిస్ట్రిబ్యూటర్స్ కరువు అని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తయారుకావటంతో ఈ సినిమాకు ఎక్కువ రేట్లు చెప్తున్నారని అందుకే బిజినెస్ కావటంలేదని చెన్నై వర్గాలు సమాచారం. బిజినెస్ మొదలైన వెంటనే రిలీజ్ డేట్ అపీషియల్ గా ప్రకటిస్తారని చెప్తున్నారు.

ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల సహకారంతో అమెరికాలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటల్ని విడుదల చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసి కమల్ అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా పండిట్‌ బిర్జూ మహారాజ్‌ దగ్గర కథక్‌ నృత్యం నేర్చుకొన్నారు. కథలో ఆ నృత్యం కీలకమని సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఇది తెరకెక్కింది. ప్రముఖ దర్శకులు శేఖర్‌ కపూర్‌ ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. కథలో ఆ పాత్ర కీలకమై సినిమాను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ స్వరాలు సమకూర్చారు.

అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రాహల్ బోస్ ని విలన్ గా కనిపించనున్నారు. సమీరా రెడ్డిని హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా ఒకే షెడ్యూల్ లో డబ్బై ఐదు రోజులు పాటు అమెరికాలో జరిగింది. హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ చిత్రమే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.....