Tuesday, July 31, 2012

నా పేరు నాగార్జున...నన్ను అలానే పిలవండి .......

"నా పేరు నాగార్జున. ఇక నుంచి కూడా అలానే పిలవండి. సాయి నాగార్జున, నాగ్‌ సాయి.. ఇలాంటి పేర్లతో పిలవొద్దు" అన్నారు నాగార్జున. నాగార్జున 'శిరిడిసాయి'గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ.మహేష్‌రెడ్డి నిర్మాత. కీరవాణి స్వరాలు అందించారు. ఈ సినిమాలోని గీతాలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారు.
nagarjuna s shirdi sai audio released
"నేను నటించిన 'శిరిడిసాయి' సినిమా పెద్ద విజయం సాధించాలని ప్రత్యేకంగా కోరుకోను. ఎందుకంటే... బాబా ఎప్పుడో హిట్‌. కోట్లాది భక్తుల హృదయాలలో స్థానం సంపాదించుకొన్నారు. సాయి పాత్ర పోషించడం నా అదృష్టం. ఈ సినిమా ఒప్పుకొన్న తరవాత నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. సాయి తత్వం బోధపడింది. ఎదుటి వారి సంతోషమే మన సంతోషం అనే విషయం అర్థమైంది. అమ్మ దూరమయ్యాక నాన్నగారిలో చిరునవ్వే చూడలేకపోయా. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయనలో సంతోషం మొదటిసారి చూశా. ఆయన నవ్వు నాకో వరం. ఈ సినిమాలోని పాటలన్నీ బాగున్నాయ''అని నాగార్జున చెప్పారు.

అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ''సినిమా తీయడం అంటే మాటలు కాదు. నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఇంత మంచి సినిమా తీయడానికి ధైర్యం చేసిన నిర్మాతలు ధన్యులు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు. మంచి చేసే మనసులోనే దేవుడు ఉంటాడనేది నేను నమ్మే సిద్ధాంతం. నిజమైన భక్తి అంటే తనను తాను అర్పించుకోవడం. భక్తిభావం అనేది వేషధారణలో ఉండదు. కళ్లతో పలికించాలి. అదెలాగో నాగార్జునకు బాగా తెలుసు. కీరవాణి పాటలు ఆహ్లాదకరంగా ఉన్నాయని''అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ... ''నా సినిమాలకు కీరవాణి మంచి బాణీలు ఇస్తారని అందరూ అనుకొంటారు. కానీ నాగార్జున సినిమాలకే ఆయన అదిరిపోయే పాటలిచ్చారు. 'అన్నమయ్య' పతాక సన్నివేశాల్లో వచ్చే 'అంతర్యామి..' పాట తెలుగు సినిమాల్లోనే ఓ అద్భుతం. ఈ సినిమాలోని 'వస్తున్నా బాబా' అనే గీతం కూడా ఆ స్థాయిలో ఉంటుంది''అన్నారు .

''ఇందులో దాసుగుణ మహరాజు పాత్ర పోషించా. ఈ సినిమా ఒప్పుకొన్న తరవాత మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటోంద''ని చెప్పారు శ్రీకాంత్‌. చిత్ర నిర్మాత మాట్లాడుతూ ''సాయి తత్వాన్ని వెండితెరపై చెబుదామనేది మా లక్ష్యం. అది రాఘవేంద్రరావు ఎంతో అందంగా తీర్చిదిద్దారు''అన్నారు. కీరవాణి స్పందిస్తూ ''నా పాటల ద్వారా స్వరాభిషేకం చేసే శుభఘడియ ఈ సినిమా ద్వారా వచ్చింది. నాగార్జున బాబాగా ఒదిగిపోయారని'' అన్నారు.
ప్రముఖ గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ ''నాగార్జున నాకిష్టమైన నటుడు. నిజ జీవితంలో ఎలాంటి ఈగోలు లేని వ్యక్తి. ఈ సినిమాలో నేను కూడా భాగమైనందుకు అదృష్టంగా ఉంది''అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, లోక్‌సభ సభ్యులు మధుయాష్కీ, సినీ ప్రముఖులు అమల, నాగచైతన్య, అఖిల్‌, డి.సురేష్‌బాబు, అల్లు అతరవింద్‌, అశ్వనీదత్‌, దిల్‌ రాజు, ఎస్‌.గోపాలరెడ్డి, కమలినీ ముఖర్జీ, పరుచూరి బ్రదర్స్‌, చంద్రబోస్‌, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment