‘ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం. ఎందుకంటే విద్యార్థుల్ని భావి భారత
పౌరులుగా తీర్చిదిద్దే మహత్తరమైన ఉన్నతమైన ఉద్యోగం అది. క్రమ శిక్షణ
నేర్పే కొలువు కూడా అది. మీ అందరికీ తెలుసు...నేను సినిమా నటుడు కాకముందు
ఉపాధ్యాయుడిగా పని చేశానని. అయితే ఒక సంవత్సరం ఆ వృత్తి లో పని చేసిన
తర్వాత నా ‘కులం' ఆ సంస్థ యజమానికి తెలిసి, అది రుచించని కారణంగా నన్ను
వారు ఉద్యోగం నుంచి తొలిగించిన విషయం కూడా మీకు గతంలో పలుమార్లు చెప్పి
ఉన్నాను. నేనే కాదు...మా నాన్నగారు కూడా బడిపంతులు ఉద్యోగం చేసారు. ఆయన
పేరు నారాయణస్వామి నాయుడు. ఆయన జీవితమంతా పిల్లల్ని తీర్చిదిద్దడానికి
వెచ్చించారు. ఆయన క్రమ శిక్షణే నాక్కూడా వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు
చెబుతున్నాను అంటే...సెప్టెంబర్ 1న తిరుపతికి సమీపంలో నేను నెలకొల్పిన
విద్యా సంస్థల సముదాయం ‘శ్రీ విద్యానికేతన్'లో గ్రాడ్యుయేషన్ డే గర్వంగా
జరుపుతున్నాను.200 మంది ఎంటెక్ విద్యార్థులకు ఈ రోజు సర్టిఫికెట్లు ప్రదానం
చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాకు మంచి స్నేహితుడైన, పాండిచ్చేరి
లెఫ్ట్ నెంట్ గవర్నర్ శ్రీ ఇక్భాల్ సింగ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ శుభ
సందర్భంలో నా మనసు ఎంతో ఆనందంగానూ గర్వంగానూ ఉంది. కలలో కూడా ఊహించని
రీతిలో నేను విద్యా సంస్థల్ని నెలకొల్పడం, ఎంతో మంది పేద విద్యార్థులకు
కుల, మతాలకు అతీతంగా ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చి చదువు చెప్పించే అవకాశం
దొరకడం నా జీవితంలో మరువలేని ఓ ఆనందకర ఘట్టంగా నేను భావిస్తున్నాను.
No comments:
Post a Comment