హీరో మారువేషం ఎందుకు వేస్తాడు? తననెవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి! శ్రీమన్నారాయణలో బాలయ్య కూడా రకరకాల వేషాల్లో విలన్లను చంపడానికి వెళ్తాడు. ఒకసారి ‘ఒక్కమగాడు’లో ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ వేషమేస్తాడు.. ఇంకోసారి సుల్తాన్ సినిమాలో గడ్డం క్యారెక్టర్ తరహా వేషమేస్తాడు. ఇంకోసారి నరసింహావతారమే ఎత్తుతాడు. మరి అతణ్ని ఎవరూ గుర్తుపట్టలేదా అంటే అదేం కాదు.. విలన్లు అతణ్ని చూడగానే ‘‘శ్రీమన్నారాయణా.. నువ్వా’’ అంటూ నోరెళ్లబెడతారు! హీరో వాళ్లను చంపేసి చక్కా పోతాడు. బాలయ్య విన్యాసాలు అభిమానులకు బాగానే ఉంటాయి.. కానీ సగటు ప్రేక్షకుడికే ఓ సందేహం.. ఇంతకీ హీరో ఆ వేషాలెందుకు వేసినట్లు.. అని. శ్రీమన్నారాయణ గురించి చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇది అభిమానులను మెప్పించే.. సగటు ప్రేక్షకుడికి సంతృప్తినివ్వని సినిమా! స్థూలంగా ఇది ఓ ఏవరేజ్ మూవీ.
శ్రీమన్నారాయణ (బాలకృష్ణ) ఓ టీవీ జర్నలిస్టు. అతను ఓ ల్యాండ్ స్కాంను బయటపెట్టి.. బైల్ రెడ్డి (జయప్రకాష్ రెడ్డి), పులికేశవరెడ్డి (సుప్రీత్), హర్షద్ మెహతా (సురేశ్)లకు శత్రువుగా మారతాడు. శ్రీమన్నారాయణ తండ్రి కల్కి నారాయణ మూర్తి (విజయ్ కుమార్) ఓ రైతు నాయకుడు. అతను జై కిసాన్ పేరుతో రైతుల కోసం ఓ ట్రస్టు నెలకొల్పి.. రూ. 5 వేల కోట్ల విరాళాలు సేకరిస్తాడు. ఐతే అనుకోకుండా నారాయణమూర్తి చనిపోతాడు. డబ్బు మాయమవుతుంది. ఈ డబ్బులు శ్రీమన్నారాయణే దొంగిలించినట్లు నేరం మోపబడుతుంది. అతను జైలుకు వెళ్తాడు. ఇంతకీ డబ్బులెక్కడికి పోయాయి? నారాయణమూర్తి ఎలా చనిపోయాడు? శ్రీమన్నారాయణ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? తనను ఇరికించిన శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.
ఇప్పటికే లెక్కలేనన్నిసార్లు తెలుగు తెరపై చూసిన ప్రతీకార కథే ఇది. పోనీ కథనమైనా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. అంతా ఊహించినట్లే సాగుతుంది. హీరో ఒక్కో విలన్ని చంపడం చూస్తుంటే మొన్నటి దూకుడు వద్దన్నా గుర్తొస్తుంది. పైగా ఆ సినిమాలో ఉన్న కోట శ్రీనివాసరావు, సుప్రీత్ ఇందులోనూ ఉన్నారాయె. స్క్రీన్ ప్లేలో ఆసక్తికర విశేషాలేం లేవు. ఐతే ఇంటర్వెల్ మలుపు, ద్వితీయార్ధం రొటీన్ గానే ఉన్నా.. అభిమానులకు, మాస్ కు నచ్చే విధంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విజయం సాధించాడు. తొలి ముప్పావు గంటలో పేలవమైన సన్నివేశాలు.. ఎలాంటి మలుపులు లేని కథనం… పావుగంటకోసారి వచ్చే సిగరెట్ సాంగులు.. చూస్తుంటే బాలయ్య ఖాతాలో మళ్లీ ఓ ఫ్లాపు చేరడం ఖాయమనిపిస్తుంది. అప్పటిదాకా అభిమానులు కూడా నీరసంగానే ఉంటారు. ఐతే ఇంటర్వెల్ కు ముందు మలుపుతో కథ ట్రాక్ లోకి వచ్చి.. ఆసక్తి నెలకొంటుంది. ఐతే ఇంటర్వెల్ తర్వాత అంతా ఊహించినట్లుగానే సాగినప్పటికీ ప్రథమార్ధంతో పోలిస్తే చాలా రిలీఫ్ గానే ఉంటుంది. ద్వితీయార్ధంలో బాలయ్య నటన, డ్యాన్సులు, ఫైట్లు అన్నీ అభిమానుల్ని అలరించేలా సాగుతాయి.
‘సామాన్యుడు’ సినిమాతో తనకంటూ ఓ శైలి ఉందని చూపిన రవికుమార్ చావలి.. ఇందులో ఏమాత్రం తన ముద్రను వేయలేకపోయాడు. ఓ మాస్ హీరో చేతిలో బందీ అయిపోయిన రవి.. రొటీన్ కథ, రొటీన్ కథనాలతో బండి నడిపించేశాడు. క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం, కృతకంగా అనిపించే పాటలు చూస్తేనే అతను ఎంతగా కాంప్రమైజ్ అయ్యాడో అర్థమవుతుంది. మన దర్శకుల్లో ఇటీవల కనిపిస్తున్న పెద్ద సమస్య ఏంటంటే వారు సమాజానికి సంబంధించిన ఏ విషయాన్నీ వాస్తవిక కోణంతో పరిశీలించట్లేదు. జనరల్ ఒపీనియన్స్ ను నమ్మి అదే వాస్తవమన్నట్లు చూపిస్తున్నారు. హీరోను జర్నలిస్టుగా చూపించిన దర్శకుడికి మీడియా విషయంలో కనీస అవగాహన కూడా లేదని అర్థమవుతుంది. ఓ స్కాంను జర్నలిస్టు బయటపెడితే.. ఆ జర్నలిస్టు స్కాంను బయటపెట్టాడని.. అతనికి అభినందనలు వెల్లువెత్తాయని స్క్రోలింగ్ ఇస్తారా.. సినిమాటిక్ గా సన్నివేశాలుండాలనుకుంటే హీరోను మామూలు వ్యక్తిగానే చూపించొచ్చు కదా. జర్నలిస్టుగా చూపించడమెందుకు?
ఓ రైతు నాయకుడు నాలుగు మీటింగుల్లో మాట్లాడేసి, రూ.5 వేల కోట్లను తాను సొంతంగా సమీకరించేస్తాడా..? అతణ్ని బ్యాంకులోనే కూర్చోబెట్టి చంపేసి, విలన్లు అంత సులభంగా డబ్బులు కొట్టేస్తారా? హీరో విలన్లను జైల్లోనే ఉంటూ సీబీఐ అధికారిని వెర్రి వెంగళప్పను చేసి, విలన్లను చంపేస్తాడా? దర్శకుడు మరీ ఇంత స్వేచ్ఛ తీసుకుంటే ఎలా? ప్రేక్షకుడిని మరీ తక్కువ అంచనా వేస్తే ఎలా? హీరోను అత్యంత శక్తిమంతుడిగా (మన హీరోలు అంతేకదా) చూపించిన దర్శకుడు.. విలన్ పాత్రల్ని మరీ బలహీనంగా మార్చేశాడు. పాటల కోసం కూర్చిన సన్నివేశాలు.. పాటల చిత్రీకరణ.. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ మరీ రొటీన్ గా, మొహం మొత్తేలా ఉన్నాయి. చక్రి సంగీతం ఔట్ డేటెడ్. పాటలు పేలవంగా ఉన్నాయి. అన్నీ రొటీన్ మాస్ సాంగ్సే. పోలూర్ ఘటికాచలం మాటలు కొన్ని చోట్ల మాత్రమే బాగున్నాయి. అందరూ వారసత్వంగా ఆస్తిని కోరుకుంటారు.. నువ్వు నా ఆశయాన్ని కోరుకున్నావు అనే డైలాగ్ బాగుంది. కానీ పదేపదే వాడటం వల్ల దాని విలువ తగ్గిపోయింది. విజయ్ కుమార్ రైతుల గురించి చెప్పే మాటలు కూడా ఓకే. దువ్వాసి మోహన్ క్యారెక్టర్ తో మాస్ కు నచ్చే పంచ్ లు వేయించాడు రచయిత. ఐతే కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు హద్దులు దాటాయి. దువ్వాసి కనిపించిన కాసేపు బాగానే నవ్వించాడు. అతని తర్వాత జయప్రకాష్ రెడ్డి కాస్త నవ్వులు పంచాడు. ఎమ్మెస్, కృష్ణభగవాన్ ల కామెడీ పండలేదు. హీరోయిన్లు పాటలకు తప్ప మరెందుకూ పనికి రాలేదు. ఉన్నంతలో పార్వతి మెల్టన్ పాత్ర కాస్త నయం. కానీ ఆమె మరీ బక్కచిక్కి చూడలేనట్లు తయారైంది.
బాలయ్య తన అభిమానుల్ని వందశాతం సంతృప్తి పరిచాడు. వారేం కోరుకుంటారో అదిచ్చాడు. ఈ వయసులోనూ డ్యాన్సులు, ఫైట్ల విషయంలో బాగా కష్టపడ్డాడు. బాలయ్య మేకప్ విషయంలో మళ్లీ ఏమాత్రం శ్రద్ధ కనబరచలేదు. నప్పని విగ్గు, డ్రెస్సులు, ముఖానికి అతికించినట్లు మేకప్ ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.
రొటీన్ సబ్జెక్టే అయినా.. పరమవీరచక్ర, అధినాయకుడు లాంటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఒప్పుకోవడం మంచి నిర్ణయమే. ఫలితం కూడా నిరాశ కలిగించకపోవచ్చు.
No comments:
Post a Comment