నాగార్జున పుట్టిన రోజు ఈ నెల 29. అంటే బుధవారం. సోమవారం ఆయన్ను అన్నపూర్ణ స్టూడియోలో కలిశాం. ముందుగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాం. వెబ్దునియా పేరు చెప్పగానే... దునియా అంతా మీదే అంటూ.. ఛలోక్తి విసిరారు. ఈ సందర్భంగా ఆయన వెబ్దునియాకు పలు విషయాలను తెలియజేశారు.
శిరిడీసాయి గురించి ఏమయినా ప్రత్యేకతలు తీసుకున్నారా?
కె. రాఘవేంద్రరావు చెప్పినట్లే చేశాను. నిజానికి ఈ సినిమా ఆరంభానికి ముందు పెద్దగా తెలియదు. వినడం తప్ప. శిరీడీ కూడా వెళ్లనూలేదు. కానీ అనూహ్యంగా ఓసారి శిరీడీ వెళ్ళాను. అక్కడ నుంచి వచ్చాక రాఘవేంద్రరావు కథ చెప్పారు. ఆ క్షణం నుంచి ఏదో రూపంలో బాబా అనుగ్రహం లభిస్తూనే ఉందని చెప్పారు. ఈ చిత్రాన్ని అన్నమయ్య, రామదాసులతో పోల్చకూడదు. ఇది సాయి చరిత. హావభావాలు, వేషధారణ కోసం.. గత బాబా సినిమాలు చూడమన్నా.. చూడలేదు. దర్శకునిపై నమ్మకంతో చేశాను. అన్నమయ్య తర్వాత 15 ఏళ్ళకు ఈ సినిమా చేశాను.
అభిమానుల నుంచి స్పందన ఎలా ఉంది?
కొత్తగా ఏం చేసినా అభిమానులు స్వీకరిస్తారు. ఎంకరేజ్ చేస్తారు. నా కెరీర్లో జరుగుతుంది అదే. కలెక్షన్ల గురించి వారు మాట్లాడుకోరు. అభిమానుల పేరుతో ఏదో మాస్ మసాలా చేశాక రిజల్ట్ రాకపోతే వేస్టేగదా. వారికి కావాల్సింది మంచి సినిమా. అది చేస్తుంటాను.
శిరిడీ సాయి పాత్రలు యూత్కు నచ్చుతాయంటారా?
అసలు బాబా భక్తుల్లో ఎక్కువమంది యువతే. శిరిడీలోనే కాదు ఎక్కడ బాబా దేవాలయాలున్నా అంతా వారే కన్పిస్తారు. యువతలో ఆధ్యాత్మిక చింతన కన్పించడం నాకు ఆశ్చర్యమేసింది.
హీరోలకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఈ విషయంలో మీ ఆలోచన ఏమిటి?
నటుడికి ఇమేజ్ అనేది లేకపోతే స్టార్ కాలేరు. అయితే ఆ కథ చేస్తే ఇమేజ్ వస్తుందేమోనని ఆతృత నాలో లేదు. నలుగురు మెచ్చిన కథ అయితే చాలు. ప్రేక్షకుల్ని మెప్పించే ఇమేజ్ కంటే ఇంకేం కావాలి చెప్పండి. నేను స్టార్ అయినా భిన్నంగా కథలు చేయడం ఆదరించడం అదృష్టంగా భావిస్తున్నాను.
మీ బేనర్లో వచ్చిన రాజన్న ఫలితం ఎలాగుంది?
ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. బిజినెస్ పరంగా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇటీవలే టీవీలో కూడా వేసేశారు. చూసివాళ్లు ఫోన్లు చేసి నటుడిగా ధన్యుడివయ్యావని, తెలిసినవారు మెచ్చుకుంటుంటే అంతకంటే కావాల్సింది ఏముంది..? నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్లో రావడం ఇప్పటికీ గర్వంగా ఫీలవుతున్నా. ఆ చిత్రాన్ని చలనచిత్రోత్సవాలకు కూడా పంపించాలి.
ఇప్పుడు కొత్త గెటప్లో లవ్స్టోరీ చేస్తున్నారే?
అవును. అది పరిణితితో కూడిన కథ. నాదైన శైలిలో ఉంటుంది. దర్శకుడు దశరథ్ దాన్ని చక్కగా చెబుతున్నారు.
డమరుకం ఆలస్యానికి కారణం?
ఇది దేవుడికి మనిషికి సంబంధించిన కథే అయినా భక్తుడి కథ కాదు. 'డమరుకం' చిత్రం చిత్రీకరణ పూర్తయింది. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా బాగా తీశాడు. అయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్ల రిలీజ్ ఆలస్యమైంది. నిర్మాత ఆర్.ఆర్. వెంకట్ రాజీ లేకుండా ఖర్చుచేశారు. సోసియో ఫాంటసీ కథలో మాస్ మసలాను అద్భుతంగా మిక్స్ చేసి దర్శకుడు తెరకెక్కించారు. నా 25 ఏళ్ల కెరీర్లో ఎవరూ చేయని కొత్త తరహా చిత్రమిది. బ్యాలెన్స్ పాటను ఈ నెల 30 నుంచి చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్లో విడుదల చేస్తున్నాం.
మాఫియా చిత్రం చేస్తున్నారు?
అవును. భాయ్ అనేది టైటిల్. అయితే మాఫియా కథ కాదు. హలో బ్రదర్లా ఎంటర్టైనర్. వీరభద్రమ్ కథ చెప్పాడు. కానీ టైటిల్ అలా ఉంటుంది అంతే.
మూడు తరాలు నటించే చిత్రం ఎంతవరకు వచ్చింది?
కొంత సమయం పడుతుంది. ఎందుకంటే విక్రమ్ కె.కుమార్ కథ చెప్పాడు. బాగా నచ్చింది. అయితే దానికి కొన్ని మెరుగులు దిద్దాలి.
అఖిల్ రంగప్రవేశం?
ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. సినిమా అంటే ఇంట్రెస్ట్.. ఇటీవలే వాళ్ళమ్మ నటించిన సినిమా షూటింగ్కు వెళ్లాడు. చూశాక.. షూటింగ్ అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. శేఖర్ కమ్ముల చెప్పిన కథ నచ్చి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో నటించింది.
ఫిల్మ్ స్కూల్ విశేషాలు?
మనదగ్గర సాంకేతిక నిపుణుల కొరత ఉంది. సినిమా రంగంలో పెద్ద మార్పులు వచ్చాయి. రాబోయే ఐదేళ్ళలో డిజిటల్ విధానం వస్తుంది. 24 క్రాఫ్ట్లోనూ ఆ మార్పులు కన్పిస్తున్నాయి. అందుకే కొత్త పద్ధతులు తెలుసుకోవాలి. ఎక్కడో విదేశాల్లోనో, ముంబై ప్రాంతాల్లోనే కాకుండా హైదరాబాద్లో చేరువలో ఉండాలని ఫిల్మ్ స్కూల్ స్థాపించాం. మంచి నిపుణులు తయారుచేయాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నాం.
మరి మీ బేనర్లో చిత్రాలు చేసే ఆలోచన ఉందా?
ఉంది. మా బేనర్లో చేస్తూ.. ఫిల్మ్ స్కూల్ వారిని ఇన్వాల్వ్ చేస్తూ తీస్తున్నాం. భాయ్ చిత్రం పూర్తిగా మా బేనర్తోపాటు మా విద్యార్థులు పని చేస్తున్నారు. మంచి కథ, కథనాలు దొరికితే చిన్నచిన్న చిత్రాలు కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాం.. అని ముగించారు.
No comments:
Post a Comment